Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవార ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అధిక శ్రావణమాసం సోమవారం ఆది దంపతుల దర్శనాల కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడి సందడిగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు జరిపే నిత్య ఆర్జిత సేవలు యదాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర, విరామ దర్శనాలకు గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
షష్టి తిధి సందర్బంగా ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి ఈవో లవన్న ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని అర్చకులు అన్నారు. వివిధ రకాల జలాలతో అభిషేకార్చనలు జరిపించిన తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేదపండితులు మహా సంకల్పం పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకిసేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.