అమరావతి : శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir ) ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు (Gates) ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 55,874 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1.33 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని తెలిపారు.
గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులకు గాను, ప్రస్తుతం 884.80 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలకు ప్రస్తుత నీటి నిల్వ 214.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ( Hydropower stations) ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 67,977 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు.
గోదావరిలో మరింత వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు . ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.2 అడుగుల నీటిమట్టం ఉండగా 10.39లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.