Srisailam | శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మౌళిక వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నట్లు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం కైలాస ద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి, క్షేత్రంలోని శివదీక్ష శిభిరాలు, పార్కులు, ఆరుబయలు ప్రదేశాలు, పుష్కరిణి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మంచి నీరు, భోజనం, వైద్యశిబిరాలను పరిశీలించారు.
విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలని, పారుశుద్ధ్యంలో ఎటువంటి అలసత్వం చూపించకుండా ప్రత్యేక దృష్టి కనబరచాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సూచించారు. అనంతరం దేవస్థాన నిత్యాన్నదాన భవనంలో శివసేవకుల పనితీరు, అన్నప్రసాద తయారీలో నాణ్యతను ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దేవస్థాన సిబ్బందితోపాటు సెక్యూరిటీ, శివసేవకులు ప్రతి ఒక్కరూ భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు.