Srisailam | శ్రీశైలం : శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామివారులకు శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. వారికి విజయవాడ ఆలయ ఈవో శీనానాయక్, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో దుర్గామల్లేశ్వరస్వామివారికి, కనకదుర్గా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిసంవత్సరం విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివారికి దసరా మహోత్సవాల్లో శ్రీశైల దేవస్థానం తరపున ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారి ఎం హరిదాస్, పర్యవేక్షకులు పీ ఉమేశ్, వేదపండితులు, అర్చకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.