శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఇందులో హుండీల ద్వారా రూ.4,00,23,145 సొత్తు వచ్చింది. గత 34 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. నగదుతో పాటు 391 గ్రాముల బంగారం, 9 కిలోల 400 గ్రాముల వెండి లభించాయని చెప్పారు.
అలాగే 3,278 యూఎస్ఏ డాలర్లు, ఐదు ఆస్ట్రేలియా డాలర్లు, ఐదు ఇంగ్లాండ్ పౌండ్స్, పది యూఏఈ దిర్హమ్స్, పది కెనడా డాలర్లు, 121 ఖతర్ రియాల్స్, 62 కువైట్ దీనార్లు, 20 సింగపూర్ డాలర్లు వచ్చాయని చెప్పారు. పటిష్ట భద్రత మధ్య, సీసీకెమెరాల నిఘా మధ్య లెక్కింపును నిర్వహించినట్లు వివరించారు. దేవస్థానానికి చెందిన అన్ని విభాగాల అధికారులు, శివసేవకులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి వారిని బుధవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆదర్శకుమార్ గోయల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.