Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జోనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైల దేవస్థాన ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో అప్పగించిన విధులపై జేసీ రాహుల్ కుమార్ ఆరా తీస్తూ ఏర్పాట్లలో లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా అన్ని సెక్టార్లలో పారిశుద్ద్యలోపం కనిపిస్తోందని, మరింత పారిశుద్ద్య సిబ్బందిని పెంచి షిఫ్ట్ పద్దతిలో 24 గంటల పాటు పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని డీపీవోను జేసీ ఆదేశించారు. భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేసే కేంద్రాల వద్ద భోజన ప్లేట్లను చెత్తకుండీలలో వేసేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుల వద్ద పాదయాత్ర భక్తులు స్నానాలు చేసి రోడ్ల మీద నీరు ప్రవహించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సంబంధిత జోనల్ అధికారులను ఆదేశించారు. పాలధార –పంచధార – హటకేశ్వరం ప్రదేశాలలో ఏర్పాటు చేసిన షాపులను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
శ్రీశైలంలోని అన్ని జోన్లలో సంబంధిత సెక్టారు అధికారులు క్షుణ్ణంగా తిరిగి పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీటికి ఇబ్బంది లేకుండా లోపాలను గుర్తించి మెరుగు పరుచుకోవాలని సూచించారు. సాక్షిగణపతి, నంది సర్కిల్, గోశాల తదితర ప్రధాన ప్రాంతాలలో భక్తులు గుమిగూడకుండా ట్రాఫిక్ చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క హోటల్లో ధరల పట్టిక కనపడటం లేదని, నిర్ణీత విక్రయ ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అలాగే ఆహారపదార్థాల నాణ్యతను పరిశీలించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.
శ్రీశైల ప్రధాన ద్వారం నుంచి బస్టాండ్ వరకు రోడ్ల వెంబడి తాత్కాలిక దుకాణాలు, రోడ్ల వెంట అమ్ముకునే చిరు వ్యాపారస్తులు రహదారికి అడ్డం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్, జోనల్ అధికారులను జేసీ ఆదేశించారు. పాతాళగంగ ఘాట్ వద్ద బారికేడింగును మరింత పెంచి భద్రతా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. స్వామిఅమ్మవార్ల దర్శనార్థమై క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో వేచివుండే భక్తులకు అల్పాహారం, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. గురువారం రోజు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనా ఉందని, మహాశివరాత్రి పర్వదినం రోజున అధికసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని, సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య, పారిశుద్ధ్యం సిబ్బంది మూడు షిఫ్టులుగా విధులు కేటాయించి ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.