Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించవద్దని కాంట్రాక్టర్లను శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచనలిచ్చారు. శనివారం ఉదయం ఇంజనీరింగ్ అధికాలతో కలిసి ఘంటామఠం, విభూది మఠం, ఆర్ అండ్ బి కూడలి, పాతాళగంగ రోడ్డు, నడకదారి, వలయ రహదారి, పార్కింగ్, శౌచాలయాలు వంటి అత్యవసర మౌలిక వసతులను పరిశీలించారు.
దేవాలయాల్లో క్యూకాంప్లెక్స్లకు వెళ్లి యాత్రికుల సమస్యలను ఈవో పెద్దిరాజు తెలుసుకున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్ల విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేసేందుకు సూచనలు ఇచ్చారు. అదే విధంగా ప్రతి కూడలి వద్ద మూడు భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కార్తీక మాసాంతం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు. ప్రధానంగా ఇటీవల చేపడుతున్న నిర్మాణ పనుల నాణ్యతలో రాజీపడవద్దని భావితరాలకు నిలిచిపోయే విధంగా ఉండాలని గుత్తేదారులకు చెప్పారు.