Srisailam | శ్రీశైలం మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకూ ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఉగాది పండుగ జరుగనున్నది. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై మంగళవారం సమావేశం జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల పాదయాత్ర భక్తి బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల భక్తి బృందాలతో రెండోసారి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటకలోని బాగల్ కోట్, బెళగావి, బీజాపూర్ (విజయపుర) తదితర జిల్లాలు, మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, అక్కల్ కోట్ ప్రాంతాల నుంచి సుమారు 34 భక్త బృందాలు, పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు మాట్లాడుతూ బాగల్ కోట్ జిల్లా రబ్కావిలో జరిగిన తొలి సమన్వయ సమావేశం, ధర్మప్రచారంలో భాగంగా అక్కడ నిర్వహించిన ధర్మ రథయాత్ర, కల్యాణోత్సవానికి కర్ణాటక, మహారాష్ట్ర భక్త బృందాలు ఎంతో సహకరించాయన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఉగాది మహోత్సవాలు జరిగే ఆరో తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే జరుగుతుందని డీ పెద్దిరాజు చెప్పారు. ఉత్సవాల రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని, ఈ విషయమై భక్తులకు భక్త బృందాల ప్రతినిధులు అవగాహన కల్పించాలని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకూ నాలుగు విడుతలుగా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కో విడుతలో 1500 టికెట్లు ఇస్తామని, గతంలో మాదిరిగానే స్పర్శ దర్శనానికి రూ.500 రుసుము నిర్ణయించామన్నారు.
భక్తులు సేద తీరడానికి ఆరుబయలు ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేస్తామని డీ పెద్దిరాజు చెప్పారు. అన్ని చలువ పందిళ్ల వద్ద మంచినీటి వసతి కల్పిస్తామని చెప్పారు. క్యూ లైన్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, అల్ఫాహారం అందిస్తామని అన్నారు. ఈ వితరణకు స్వచ్చంద సేవకులు సేవలు అందించాలని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవస్థానం వైద్యశాల నిరంతర వైద్య సేవలు అందిస్తుందన్నారు. శ్రీశైల క్షేత్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం కూడా నిరంతర వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు.
స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించామని పెద్దిరాజు చెప్పారు. కనుక భక్తులంతా పలుచోట్ల దేవస్థానం ఏర్పాటు చేసిన శౌచాలయాల్లోనే తమ కాలక్రుత్యాలు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ విషయమై భక్తులకు స్వచ్చంద సేవా సంస్థల సేవకులు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
ఉగాది మహోత్సవాల్లో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటామని ఈవో పెద్దిరాజు చెప్పారు. ఈ స్వచ్చంద సేవకులు స్వామివారి ఆలయం, ముఖ మండపం, నంది మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం, ఉచిత క్యూ లైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగా భవానీ స్నాన ఘట్టాలు, పాతాళ గంగ, హఠకేశ్వరం, సాక్షి గణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, తాత్కాలిక సమాచార కేంద్రాలు తదితర ప్రాంతాల్లో సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 10 వరకు స్వచ్ఛంద సేవకులు సేవలు అందించాలని చెప్పారు.
ఉగాది మహోత్సవాల సందర్భంగా సేవలు అందించే స్వచ్చంద సేవకులకు లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలు కేటాయించారు. గతంలో మాదిరిగానే పారదర్శకత కోసం స్వచ్చంద సేవా బృందాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీశారు. ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారి రవణమ్మ, దేవస్థానం పరిపాలన, ఆలయ, ప్రజా సంబంధాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.