Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే కన్నడ భక్తులతో ప్రతి ఒక్కరూ స్నేహ భావంతో మెలగాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు దుకాణదారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం పరిపాలనా భవనంలో దుకాణదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈఓతోపాటు ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఎస్సై నవీన్బాబు, ఏఈఓ మల్లికార్జునరెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈఓ డీ పెద్ది రాజు మాట్లాడుతూ ప్రధానంగా కన్నడ భక్తులతో భాషాపరమైన సమస్యలు అధిగమించేందుకు కన్నడ సేవా సంస్థల ప్రతినిధులను, వాలంటీర్లను వాణిజ్య సముదాయాల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి వ్యాపారి కూడా నిర్ణీత ధరలను అమలు పరుస్తూ ఎంఆర్పీ ధరలకు మాత్రమే వస్తువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై సంబంధిత శాఖల నుండి కఠిన చర్యలు తీసుకోవడమే కాక దేవస్థానం వ్యాపార లైసెన్సులు, లీజు అగ్రిమెంట్లు రద్దు చేయనున్నట్లు ఈఓ డీ పెద్దిరాజు హెచ్చరించారు. ప్రధానంగా హోటల్ నిర్వాహకులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచుకుని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రధాన కూడళ్లు, వాణిజ్య సముదాయాల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు అర్ధమయ్యేలా కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి ఈఓ సూచించారు.
సంవత్సరం పొడవునా లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తూ ప్రత్యేక దినాల్లో కాస్తంత వ్యాపారాన్ని కండ్ల చూడాలనుకునే మాకు తాత్కాలిక రశీదులతో రోడ్ల ప్రక్కన స్థానికేతరులు వచ్చి నిర్వహించే వ్యాపారాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని షాపుల యజమానులు అధికారులకు ఏకరువు పెట్టారు. వీలైనంత వరకు వాణిజ్య సముదాయాల సమీపంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో తాత్కాలిక రశీదు దుకాణాలను కేటాయించమని కోరారు. దుకాణదారుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఈఓ డీ పెద్దిరాజు.. తగు చర్యలు చేపట్టాలని రెవిన్యూశాఖ అధికారులను ఆదేశించారు.