Srisailam | భూ మండలానికి నాభి స్థానం శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం నుండి దసరా శరన్నవరాత్రుల వేడుకలు శాస్ర్తోకంగా ప్రారంభం కానున్నాయి. శ్రీశైల ప్రధానాలయంతోపాటు ఉప ఆలయాలు, ప్రాకారానికి చేసిన విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగి పోతున్నాయి. ఆలయ ఈఓ పెద్దిరాజు దంపతులు అర్చక వేదపండితులతో కలిసి ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేస్తారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్ష సంకల్పం, కంకణ పూజ, ఋత్విక గ్వరణం, అమ్మవారి యాగశాల ప్రవేశం, అఖండదీపస్థాపన, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు చేస్తారని అధికారులు తెలిపారు.
అలాగే స్వామివారి ఆలయ యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ,వాస్తు పూజ, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకం జరగనున్నాయి. మధ్యాహ్నకాలార్చన, సహస్రనామార్చన, మహానివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవవార్చన, కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం జరుగుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకార పూజలు జరిపించి గ్రామోత్సవనంతరం రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం జరుగుతుందని ఈవో పెద్దిరాజు తెలిపారు.
ఆదివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై గ్రామోత్సవంలో విహరిస్తారు. శైలపుత్రిగా దర్శనమిచ్చే భ్రామరి అమ్మవారిని చూసేందుకు అధిక సంఖ్యలో రానున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.