శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్వామివారి గర్బాలయ దర్శనాల సమయం పెంచాలని వివిధ ప్రాంతాల భక్తులు వినతి చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు.
ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా ఉత్తరాది ప్రాంతాల భక్తులతో కలిపి మెత్తం 23 మంది భక్తులు తమ అభిప్రాయాలను నేరుగా ఈవోకు తెలియజేశారు. అందులో ప్రధానంగా దర్శవిధానాలలో మార్పులు, శివనామ నగర సంకీర్తన ఆరంభం, శ్రీశైలప్రభ మాసపత్రిక చందాదారుల సమస్యలు, పరోక్షసేవలో పాల్గొనే సేవాకర్తలకు ప్రసాదాలు అందకపోవడం, వివిధ పథకాలకు విరాళాలు ఇస్తున్న దాతల గుర్తింపు కార్డుల జారీ, వసతి ఏర్పాట్లు వంటి పలు సమస్యాత్మక విషయాలపై వచ్చిన ఫిర్యాదులు సలహాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రధానంగా స్వామివారి గర్బాలయ ఉచిత స్పర్శ దర్శన సమయాన్ని మరో గంటసేపు పెంచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా కార్యక్రమం అనంతరం ప్రధాన విభాగాధిపతులతో జరిగిన సమావేశంలో భక్తుల నుండి వచ్చిన ఫోన్కాల్స్పై ఆయా విభాగాల సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.