Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం గో సంరక్షణ శాల (గౌరీ గణేశ గోశాల)లో రూ.36 లక్షల అంచనా వ్యయంతో రక్షణ కంచె ఏర్పాటు, అవసరమైన చోట్ల గాల్వనైజ్డ్ షీట్తో షెడ్ ఏర్పాటు, సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం, విభూది తయారీ షెడ్డుకు మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య స్వామి, జంగం సుజాతమ్మ, జీ నరసింహారెడ్డి, ఎం విజయలక్ష్మి, అలకుంట గారి మురళి, మేరాజోత్ హనుమంత్ నాయక్, ఓ మధుసూధన్ రెడ్డి, సూరిశెట్టి మాధవీ లత, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, రామ్మోహన్ నాయుడు, దేవస్థానం సహాయ ఈఓ రమణమ్మ, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అకస్మికంగా మరణించిన దేవస్థానం వేద పండితులు జగన్నాథ శర్మ మృతి చెందడం ఎంతో బాధాకరం అని ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి అన్నారు. ఆయన ఆత్మ శాంతి చెందాలని కోరుతూ సమావేశం మౌనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ విజయవంతంగా మహా కుంభాభిషేకం నిర్వహించిన ఈఓ పెద్దిరాజు, దేవస్థానం సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు.