శ్రీశైలం : శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో అధికారులు క్రస్టుగేట్లను ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. సాయంత్రం 7 గంటలకు ఓ గేటును ఎత్తి దిగువ నాగార్జున సాగర్ వైపు నీటిని విడుదల చేస్తామని, ఇన్ఫ్లోను బట్టి 10 గేట్లను ఎత్తే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వెంకట రమణయ్య తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 881.50 అడుగులు (196 టీఎంసీలు)గా ఉంది. ఎగువ తుంగభద్ర, జూరాల, సుంకేశుల నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుండటం.. ఇప్పటికే శ్రీశైలం నిండటంతో ఇక వచ్చిన వరద వచ్చినట్లు నాగార్జున సాగర్కు చేరనుంది. ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ సైతం నిండే అవకాశం ఉంటుంది.