Srisailam | శ్రీశైలం ప్రజలు, యువత ఆనందోత్సాహాల మధ్య కొత్త ఏడాది (2025)కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి, నూతన సంవత్సర ఉత్సవాలు జరుపుకునేందుకు సమయాత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసుశాఖ తెలిపిన నిబంధనలు పాటించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని శ్రీశైలం సీఐ ప్రసాదరావు తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుపుకునేవారు ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ ఆరోగ్య కరమైన వాతావరణంలో జరుపుకోవాలని సీఐ ప్రసాదరావు తెలిపారు జిల్లా అంతటా 30- పోలీస్ యాక్ట్ అమలు లో ఉన్నందున ప్రజలందరూ పోలీస్ నిబంధనలు పాటించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారు రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ సిస్టమ్ వాడరాదని తెలిపారు.
రాత్రి 10 గంటల తరువాత పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సీఐ ప్రసాదరావు సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో, ముఖ్యమైన జంక్షన్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మేగజైన్స్, హోర్డింగ్ల్లో అశ్లీలత కల పోస్టర్లు, ప్రకటనలు నిషేధం. వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, సినిమాలు, అశ్లీల సంజ్ఞలు ఆనుమతించబడవని స్పష్టం చేశారు.
ఔట్- డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో డీజే సౌండ్ బాక్సులు, పటాకులు కాల్చడానికీ అనుమతి నిరాకరిస్తామని సీఐ ప్రసాదరావు చెప్పారు. మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా నిరోధించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు. వైన్ షాపులు నిర్దేశిత సమయంలోగా మూసివేయాలని స్పష్టం చేశారు. మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మోటార్ బైక్ల సైలెన్సర్ తీసివేసి ఆధిక శబ్ధం వచ్చేలా రోడ్లపై ప్రయాణించరాదని సీఐ ప్రసాదరావు పేర్కొన్నారు. మద్యం సేవించి రోడ్లపై ప్రయాణించరాదని, వాహనాలపై ఆధిక వేగంతో, ప్రమాదకర డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. కట్టుదిట్టంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. బైక్ రేసర్లపై నిఘా ఉంటుందని చెప్పారు.
ఆకతాయిలు, మితిమీరి ప్రవర్తించే యువతను, రోడ్లపై చిందులు తొక్కే మందుబాబులను, ఇష్టానుసారంగా వాహనాలను నడిపే వారిని చిత్రీకరించేందుకు వీడియో కెమేరాలు, డిజిటల్ కెమెరాల వినియోగిస్తామని ప్రసాదరావు అన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ముమ్మరంగా పెట్రోలింగ్ ఉంటుందన్నారు. పెట్రోలింగ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమిస్తామన్నారు. తల్లిదండ్రులు, వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ నిబంధనలు పాటిస్తూ అందరూ నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. శ్రీశైలం ప్రజలకు సీఐ ప్రసాదరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.