Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పదకొండు రోజులపాటు నవవాహ్నిక దీక్షతో పూజాధికాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఏడవరోజైన గురువారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు.
గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభద్ర స్వామి వరకు గ్రామోత్సవం ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, భీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ జరిగాయి.
గజం అంటే ఐశ్వర్యానికి, అంగబలానికి, ఆదిపత్యానికి ప్రతీక. శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి శ్రీలింగ మహాచక్రవర్తి.జయజయ ద్వానాలనడుమ జగన్మాత భ్రమరాంబిక అమ్మతో కలిసి అధిరోహించి దర్శనమిచ్చాడు. గజవాహన సేవలో స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన అష్టైశ్వర్యాలు కలిగి భక్తులకు కొండంత అండగా ఉంటానని అభయమిస్తున్నట్లు విశ్వసిస్తారు. గ్రామోత్సవంలో ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజుతోపాటు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, మోహన్, స్వాములు, మల్లికార్జున రెడ్డి, ఫణిధర్ ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయన్న, సూపరింటెండెంట్ రవి, వెంకటేశ్వరులు, మధుసూదనరెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ మాడవిధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్యం, కథక్, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయని పీఆర్వో శ్రీనివాసరావు అన్నారు.