Srisailam Temple | శ్రీశైలం : ఈ నెల 7న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 8న ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని పేర్కొన్నారు. చంద్రగ్రహణం 7న రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. వేకువ జామున 1.26గంటల వరకు ముగుస్తుందని చెప్పారు. గ్రహణం కారణంగా స్వామివారి స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేసినట్లు చెప్పింది. అదేవిధంగా ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు, పరోక్ష సేవలు, స్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేసినట్లు వివరించారు. భక్తులకు కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే, సాక్షిగణపతి, హాఠకేశ్వరం- ఫాలధార పంచదార, శిఖరేశ్వరం తదితర పరివార ఆలయాలను కూడా మూసివేయనున్నట్లు తెలిపారు.
8న ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తర్వాత స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఉదయం 7.30 నుంచి స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులను జరిపించనున్నట్లు తెలిపారు. మహా మంగళహారతుల సమయం నుంచే అనగా ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 8 నాటికి ఆన్లైన్లో స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పర్శ దర్శనాలు కల్పిస్తామని వివరించారు. తిరిగి సాయంకాలం 5.30 నుంచి రాత్రి 9 వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయన్నారు. ఆన్లైన్ ద్వారా స్వామి వారి స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు రాత్రి గం 9గంటల నుంచి స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు వివరించారు.