Srinivasa kalyanam | ఒంగోలులో శ్రీనివాస కల్యాణ కన్నుల పండువగా జరిగింది. శ్రీనివాసుడి కల్యాణానికి టీటీడీ బోర్డు విస్తృతంగా ఏర్పాటు చేసింది. శ్రీనివాసుడి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగర శివారులో బుధవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక ఆవరణం మార్మోగింది. భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్యాణం ఘట్టాలకు అనుగుణంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో దాత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి దంపతులతో పాటు మంత్రి విడదల రజని, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీద మస్తాన్ రావు, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.