Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహా శివరాత్రి నాడు మల్లన్నను వరుడ్ని చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. మహా శివరాత్రి నాటి ప్రధాన ఘట్టాలైన పాగాలంకరణ, లింగోద్బవకాల ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు ఆలయ ప్రవేశం చేయడానికి పలు ప్రయత్నాలు చేశారు. అదే విధంగా పాగాలంకరణ, కళ్యాణంలో పాల్గొనే వీఐపీ పాస్లతో పాటు సామాన్యభక్తులకు అవకాశం కల్పించామని చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తెలిపారు. .
శ్రీశైలేశుని వరునిగా చేసే అద్బుత ఘట్టమే పాగాలంకారం. ప్రకాశం జిల్లా హస్తినాపురం వాసి పృధ్వి వెంకటేశ్వర్లు శివరాత్రి కళ్యాణానికి స్వామివారి సువర్ణ గర్భాలయ కళశం పై నుండి నవనందులను కలుపుకుంటూ ప్రత్యేక ఆకృతిలో పాగాను అలంకరించారు. కఠోర నియమాలతో సంవత్సరాంతం రోజుకో మూరచోప్పున నేసి శివయ్యను పెళ్లి కొడుకును చేసేందుకు ఆభరణంగా ఉపయోగించడం సంప్రదాయమని అర్చకులు చెప్పారు.
మరోవైపు లింగోద్బవ సమయంలో గర్బాలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఎస్ లవన్న ఆధ్వర్యంలో 11మంది నిష్ణాతులైన వేదపండితులు స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదుపరి సుమారు నాలుగు గంటల పాటు శ్రీశైల మల్లన్నకు వివిధ రకాల శుద్ద జలాలు, పండ్లరసాలతో అభిషేకించారు. జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అర్చక వేదపండితులు వీలు కల్పించారు.
లింగోద్బవం అనంతరం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల లీలాకళ్యాణం అంగరంగ వైభవంగ నిర్వహించారు. కళ్యాణోత్సవంలో స్వామిఅమ్మవార్లు పట్టు వస్త్రాలతో సర్వాలంకరణ శోభితులై నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో వేద మంత్రోచారణల నడుమ నేత్రానందకరంగా జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించారు.