Srisailam | వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి రావడంతో సోమవారం మహా పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం సందడి సందడిగా మారింది. వేసవి సెలవులోతో ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో శ్రీ గిరి పుర వీధులు కిటకిట లాడాయి. భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసుకుని, కృష్ణమ్మకు నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనాలకు బారులుదీరారు.
ఉచిత దర్శనానికి సుమారు నాలుగు గంటలు, శ్రీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు స్పర్శ దర్శనాలు, స్వామివారికి సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నారు.
సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శనాలు, వసతి గదుల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. క్షేత్రానికి వచ్చే ముందు ఆన్లైన్ సర్వీస్లద్వారా కావాల్సిన టిక్కెట్లు బుకింగ్ చేసుకోవాలని కోరారు. ఆలయం తెరిచినప్పటి నుండి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.