తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి( Srirama Navami) పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని టీటీడీ( TTD ) అధికారులు వివరించారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు.
ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ , రాత్రి 9 నుంచి 10 గంటల వరకు నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నామని వివరించారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు.