తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలకు (Padmavati Pavitrotsavam) ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ( TTD ) ఆలయ అధికారులు వెల్లడించారు . ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 2న సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాలతో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 5న పవిత్రప్రతిష్ఠ, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రూ.750 చెల్లించి గృహస్తులు ఒక రోజు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తామన్నారు.
సెప్టెంబర్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సెప్టెంబరు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 4న అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5న అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ సేవలను , 5, 6,7 తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.