TTD News : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజై శ్రీ మలయప్ప స్వామి అశ్వవాహనంపై ఊరేగారు. మంగళవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు కల్కి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలిపింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
వాహనసేవలో శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జార్కండ్ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ రవి రంజన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు నంద కుమార్, రామేశ్వరరావు, మధుసూదన్ యాదవ్, మారుతి ప్రసాద్, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జేఈఓలో శ్రీమతి సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.