తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీ అలమేలుమంగ అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు.
అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారిన గజ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
తిరుమలలో లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని గురువారం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు.
టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవా లు వైభవంగా జరుగుతున్నాయని, నవంబర్ 28న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. తిరుమల నుంచి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి కాసుల హారాన్ని తీసుకొచ్చి జెఈవో వీరబ్రహ్మంకు అందజేశారు.