Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆది దంపతుల దర్శనాల కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడి సందడిగా మరాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు జరిపే నిత్య ఆర్జిత సేవలు యదాతథంగా కొనసాగిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది, శీఘ్ర, అతిశీఘ్ర, విరామ దర్శనాలకు గంట సమయం పడుతుందని ఆలయ పర్యవేక్షకులు తెలిపారు.
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేదపండితులు మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకిసేవ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు.