శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండటంతో ఎలాంటి లోటు రాకుండా దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయం ప్రాంగణంలో దత్తాత్రేయ స్వామి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శ్రీపాద వల్లభుడు భక్తులను అనుగ్రహించేలా వేదపండితులు పూజలు చేశారు. లోకకల్యాణాన్ని కోరుతూ దత్తాత్రేయుడికి అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా జరిపినట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. శ్రీశైలం డ్యాం గేట్లు తెరవడం, మరోవైపు వరస సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్లైన్లో వసతి గదుల కేటాయింపు చేసుకోవాలని ఆయన సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఈఓ లవన్న సూచించారు.
రేపు శ్రావణమాస ప్రత్యేక పూజలు
శ్రావణమాసం సందర్బంగా ప్రత్యేక పూజలు జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈఓ ఎస్ లవన్న నేతృత్వంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు చంద్రావతి కల్యాణ మండపంలో వ్రత పూజా కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పించి, అన్న ప్రసాద వితరణ జరపనున్నారు. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే యాత్రికులతోపాటు స్థానిక మహిళలు, శివసేవకులతో కలిపి దాదాపు 1000 మంది ఈ వ్రతంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.