తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తేదీల్లో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
నంబర్ 07481 రైలు తిరుపతిలో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అటు ఈ నెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు రైళ్లు నడుస్తాయి. నంబర్ 07482 రైలు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రెండు రైళ్లు రేణిగుంట, కడప, ఎర్రగుంట, తాడిపత్రి, గుంతకల్లు, మంత్రాలయం, రాయచూర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయి.
మరోవైపు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడగించింది. సికింద్రాబాద్-మధురై మధ్య ప్రతి మంగళవారం నడిచే రైలు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 26 వరకు పొడిగించారు. మధురై-సికింద్రాబాద్ రైలును వచ్చే నెల 28 వరకు పొడిగించగా.. సికింద్రాబాద్-జైపూర్ మధ్య నడిచే రైలును సెప్టెంబర్ 30 వరకు, అలాగే జైపూర్-సికింద్రాబాద్ మధ్య రైలును అక్టోబర్ 2 వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.