శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలకు కూడా భక్తుల రద్దీ కూడా సాధారణంగా ఉంది.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కాశీక్షేత్ర జగద్గురు పీఠాధిపతి శ్రీజగద్గురు చంద్రశేఖర శివాచార్యమహాస్వామి దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు అర్చకుల ఆహ్వానం పలికి పూలమాలతో స్వాగతించారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆయన వెంట శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి కూడా ఉన్నారు.