Srisaialm | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం కింద ఉన్న దత్తాత్రేయస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) జరిపించే ఈ కైంకర్యంలో భాగంగా ముందు మహాగణపతి పూజ జరిపించారు. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
లోకోద్ధరణ కోసమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూంలో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిపూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. కాగా, శ్రేశైల క్షేత్రానికి దత్తాత్రేయునికి ఎంతో దగ్గరి సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయులు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.
దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో గోదావరి తీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. ఒకసారి శ్రీశైల క్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురు చరిత్రలో చెప్పబడింది. శ్రీపాదవవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుమార్లు ప్రస్తావించారు.
శ్రీపాద వల్లభుల జన్మ తర్వాత మహారాష్ట్రలోని కరంజినగరంలో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయ స్వామి జన్మించారు. ఆయన ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవించినట్లుగా గురు చరిత్ర చెబుతోంది. నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు.
కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువ కావడంతో నృసింహసరస్వతి స్వామి అదృశ్య రూపంలో ఉండి భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దీంతో ఆయన భౌతిక దేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు. శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతి స్వామి వారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చొని కృష్ణానదిలో ప్రవేశించారు. కొంతదూరం ఆ అరటి ఆకులపైనే పయనిస్తూ అదృశ్యమైనట్లు గురు చరిత్ర చెబుతోంది.