అమరావతి : విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి(Special focus ) సారించామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు (Minister Rammohan Naidu) అన్నారు. శనివారం గన్నవరం ఎయిర్పోర్టులో అప్రోచ్ రహదారిని ప్రారంభించారు. విజయవాడ- ఢిల్లీకి ఇండిగో సర్వీసు(Indigo Service) ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మూడు నెలల్లోనే ఏపీ నుంచి 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణేకు , అక్టోబర్27న విశాఖ – న్యూఢిల్లీకి కొత్త సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. షార్జా(Sharjah) కు ప్రస్తుతం పలు సర్వీసులు నడుస్తున్నాయని వివరించారు. దుబాయ్, సింగపూర్కు సర్వీసులను విస్తరించనున్నామని తెలిపారు.
దేశం మొత్తం ఆంధ్రావైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. గన్నవరం ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ (New Terminal) ఏడాదిలోగా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.