కర్నూలు: శ్రీశైలంలో మహాశివరాత్రి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. దీక్షా శిబిరాల వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు షోడశోపచారలతో అర్చకులు పూజ్యాధికాలు నిర్వహించారు. 15 రోజుల పాటు దీక్షా విరమణ కార్యక్రమం ఉంటుంది. శివదీక్షను స్వీకరించిన భక్తులకు చంద్రావతి కళ్యాణ మండపం నుంచి ఆలయ తూర్పు మాడవీధి ద్వారా ప్రత్యేక దర్శనం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే, భక్తుల రద్దీ అధికం కావడంతో గతంలో ప్రకటించిన మల్లన్న స్పర్శ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. దాంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనై వెనుదిరిగారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇవాళ, రేపు స్వామి వారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో శివ దీక్ష స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో సామాన్య భక్తులు సైతం ఎక్కువ సంఖ్యలో రావడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. స్వామి దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్పర్శ దర్శనాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు, శివ దీక్షా స్వాములు వస్తారని ఆలయ అధికారులు ఊహించకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. స్పర్శ దర్శనం కోసం భక్తులు చాలా సేపు ఎదురుచూశారు. అయితే, రద్దీ ఎక్కువగా ఉండటంతో స్పర్శ దర్శనం చేయించలేకపోతున్నామని సిబ్బంది స్పష్టం చేశారు. దాంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. అయితే, ఇరుముడితో వచ్చిన శివ దీక్షా స్వాములకు మాత్రం ప్రత్యేక సమయంలో స్పర్శ దర్శనాలు కలిపిస్తామని చెప్పడంతో దీక్షధారులు ఉపశమనం పొందారు. మంగళవారం నుంచి వచ్చే నెల 4 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.