Srisailam | శ్రీశైలం : ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రెండురోజుల పాటు శ్రీశైలంలో పర్యటించనున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరై.. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి.. స్పెషల్ పార్టీ పోలీసులకు అవసరమైన సూచనలు చేశారు. వారి వెంట ఎస్పీ చంద్రబాబు, శ్రీశైలం సీఐ జీ ప్రసాద్రావు ఉన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఇప్పటికే కలెక్టర్ రాజకుమారి పర్యటించి సూచనలు చేశారు. హెలిప్యాడ్ మైదానం చుట్టూ బారి కేడ్లు ఏర్పాటు చేయాలని, వాటర్ చల్లించాలని ఆర్అండ్బీ, అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు.
కాన్వాయ్లో కండిషన్ ఉన్న వాహనాలను ఏర్పాటు చేయాలని.. భ్రమరాంబ అతిథిగృహంలో ప్రోటోకాల్ ప్రకారం.. గవర్నర్కు వసతి, అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లను చెప్పారు. హెలిప్యాడ్ సమీపంలో మెడికల్ క్యాంప్, అంబులెన్స్, కార్డియాలజిస్ట్తో పాటు నైపుణ్యం ఉన్న డాక్టర్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్ఎస్, నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ని కలెక్టర్ ఆదేశించారు. గవర్నర్ పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని డీపీవోకు, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. దేవస్థానంలో సంప్రదాయం మేరకు గవర్నర్కు స్వామి అమ్మవార్ల దర్శనాలను కల్పించాలని, ఈ మేరకు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు.