అమరావతి : కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గంగాధర్ అలియాస్ సుధీర్ అనే యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తు రెండు రోజుల సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. పొలం వద్దకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
పొలం వద్దకు తండ్రి వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా కనిపించిన కుమారుడిని చూసి గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని పత్తికొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి మెడ, కాళ్ల వద్ద కాట్లు ఉన్నట్లు గుర్తించారు. విషపురుగు కాటువల్ల చనిపోయాడా లేక మరే ఇతర కారణాల వల్ల మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గాని యువకుడి మృతిపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వివరించారు.