తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. బుధవారం శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ఆరు రోజుల పాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ “సివిల్ ఇంజినీరింగ్ లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానం, మెళకువలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా సంస్థకు మరింత ఉన్నత సేవలు అందించే అవకాశం కలుగుతుందని” చెప్పారు.
ఇంజినీరింగ్ లేనిదే టెక్నాలజీ లేదని,రోడ్లు,భవనాలనిర్వహణ,లీకేజీలు అరికట్టడం,టెండర్లు నిర్వహణ అంశాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం,యంత్రాల నిర్వహణ అంశాలపై ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. టీటీడీ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ ఎస్ ఈ సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. అనుభవంతో పాటు ఇంజినీరింగ్ లో జరుగుతున్న మార్పులు, నూతన మెళకువలు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
శ్వేత డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులు వచ్చి శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. టీటీడీ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం పాత్ర కీలకమని, నూతన మెళకువలు తెలుసుకోవడం మంచిదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.