Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ప్రధాన దేవాలయ అనుబంధ ఆలయం.. ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అర్చక స్వాములు శాస్తోక్తంగా నిర్వహించారు.
తొలుత శ్రీసీతారామ, ఆంజనేయుల వారికి విశేష పూజాధికాలను నిర్వహించారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సీతా రాముల కళ్యాణ మహోత్సవంలో సంకల్ప పఠనం, గణపతి పూజ, వృద్ది, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం జరిపించారు.
అటుపై స్థలశుద్ది, కంకణధారణ మహా సంకల్పంతో ప్రారంభమై సీతమ్మవారికి మాంగళ్యధారణ తలంబ్రాలు, హనుమంతునికి ప్రత్యేక పూజలను సంప్రదాయబద్దంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ వెంకటేష్, ఈఈ రామకృష్ణ, ఏఈవో హరిదాస్లతోపాటు అర్చకులు, వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.