అమరావతి : ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT investigation) బృందం శనివారం నుంచి దర్యాప్తును ప్రారంభించింది . ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురంలో జరిగిన ఘటనలపై ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూటిన సిట్ బృందానికి డీజీపీ పలు ఆదేశాలు జారీ చేశారు. హింసాత్మక ఘటనలపై కేసులను పునఃసమీక్షించాలని ఆదేశించారు.
ఎన్నికల రోజు, తర్వాత ఘటనలపై నమోదు చేసిన వివిధ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని సూచించారు. నేర నిరూపణకు అదనపు సెక్షన్లూ జోడించేలా చూడాలని, ప్రతీ కేసు దర్యాప్తులో అవసరమైతే అదనపు సెక్షన్లు పెట్టేలా చూడాలని సిట్కు సూచించారు. అవసరమైన చోట ఎఫ్ఐఆర్(FIR) నమోదుకు సిట్ సిఫార్సు చేయొచ్చని స్పష్టం చేశారు. మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లు, ఏజెంట్లు, పార్టీ అభ్యర్థులపై దాడులు, హత్యాయత్నం, పౌరుల ఇండ్లపై పెట్రోలు దాడులు కలకలం సృష్టించాయి.
ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీలు సైతం స్వయంగా ఢిల్లీకి పిలుపించుకుని జరిగిన ఘటనలపై నివేదిక రూపంలో తీసుకున్నారు. పలు ఈ నివేదిక ఆధారంగా జిల్లాల కలెక్టరు, ఎస్పీల బదిలీ, మరికొందరిపై వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అల్లర్ల కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని, కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిని సిట్ ఏర్పాటు చేసింది .