Tirumala | తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో ఆదివారం మరోసారి సిట్ సభ్యులు సమావేశమయ్యారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై లోతైన విచారణ చేస్తామని ఈ సందర్భంగా సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు
తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయ్యిందని సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని చెప్పారు. నివేదిక సమర్పించడానికి ఎలాంటి కాలపరిమితి లేదని అన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపడుతున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్సీ హర్షవర్దన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దుండిగల్లో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. అలాగే తిరుమలలో లడ్డుపోటు, విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది. అక్కడి లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు.