శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన ప్రదోషకాల సమయంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులచే మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పుష్పాలంకరణ చేసిన వెండి పల్లకీపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఇదిలా ఉండగా.. స్వామిఅమ్మవార్ల నిత్య కైంకర్యాల కోసం సికింద్రాబాద్కు చెందిన రాహుల్ జయలక్ష్మి దంపతులు బంగారు కమండలాన్ని బహూకరించారు. కర్నూలుకు చెందిన ఎస్ చెన్నారెడ్డి దేవస్థానం నిర్వహించే అన్నదాన పథకానికి లక్ష విరాళం ఇచ్చారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో బంగారు కమండలానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, జ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.