తిరుపతి : విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణను మార్చి 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. సంప్రోక్షణ నిర్వహణ కోసం ఆలయ, పరిపాలన సిబ్బంది తగినంత మందిని డిప్యుటేషన్పై పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్నప్రసాదాల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. భక్తుల కోసం పాదరక్షలు భద్రపరుచుకునే కౌంటర్ ఏర్పాటు చేయాలని , నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగరబత్తీలు, ఫొటోఫ్రేమ్లు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏప్రిల్ 10 నంచి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్ఇలు వేంకటేశ్వర్లు, సత్యనారాయణ, ట్రాన్స్పోర్టు జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.