తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించనున్నామని ఈవో ఎ వి ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్బంగా భక్తుల నుంచి వచ్చిన ఫొన్కాల్స్కు ఈవో సమాదానం చెప్పారు.
ఈనెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు . నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికి సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాల ని టీటీడీ నిర్ణయించిందన్నారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని సూచించారు.
పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గోశాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి 2004వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు 17 మంది దాతలు రూ.200 కోట్లకుపైగా విలువైన కూరగాయలను విరాళంగా అందించారని వివరించారు.