తిరుమల : కార్తిక వనభోజనం సందర్భంగా ఆదివారం తిరుమలలోని వైభవోత్సవ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు.
ప్రతి ఏడాది కార్తిక మాసంలో పార్వేటి మండపం వద్ద కార్తిక వనభోజనాలను వర్షాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
19 నుంచి శ్రీ వేదనారాయణస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి : నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఈనె 19, 20వ తేదీల్లో జరుగనున్నాయని అధికారులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. 19న ఉదయం ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, 20న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేపడతారని వివరించారు.