అమరావతి : ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు , పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి(MP Vemireddy Prabhakar reddy) , ఎన్టీఆర్ జిల్లా మైలావరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(MLA Krishna Prasad) శనివారం టీడీపీ(TDP) లో చేరారు.
నెల్లూరులో వేమిరెడ్డి, హైదరాబాద్లో వసంత కృష్ణ ప్రసాద్లకు టీడీపీ చంద్రబాబు నాయుడు పార్టీ కండువాకప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నా పరిధి మేరకు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. మరింత మందికి సేవ చేయాలనే రాజకీయాల వైపు అడుగేశానని పేర్కొన్నారు. టీడీపీ చేరడం సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని అన్నారు. ఐదేళ్లుగా వైసీపీ పాలనలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాలేని పరిస్థితి ఉందని అన్నారు. చంద్రబాబు నిర్ణయం మేరకు పోటీ చేస్తానని, టికెట్ ఇవ్వకపోయిన పరవాలేదు. పార్టీకోసం సేవచేస్తా. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కృషిచేస్తానని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు రావాలన్నదే తన లక్ష్యమని అన్నారు.