కర్నూలు: శ్రీశైలం శైవక్షేత్రంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం సిద్ధమైంది. మహాశివరాత్రికి ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం వస్తుంటారు. దాంతో శ్రీశైలంలో ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఆలయం అధికారులతో సమీక్ష జరిపారు.
శివరాత్రికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హరి జవహర్ లాల్ సూచించారు. కొవిడ్ కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. అలాగే, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాలినడకన ఆలయానికి వచ్చే భక్తులకు నల్లమల అటవీ మార్గంలో వసతి, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున పారిశుద్ధ్యం, వైద్యం, వసతి, పార్కింగ్, సామాన్లు భద్రపరచడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. శ్రీశైల మహాక్షేత్రం మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా రానున్న 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా బృహత్తర ప్రణాళికతో అభివృద్ధి ఏర్పాట్లు చేయాలని దేవాలయ అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో లవన్న, అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో ఎస్ లవన్న వివరించారు.