Srisailam | శ్రీశైల మహాలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఐదవ రోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మంగళవారం ఉదయం చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు.
స్వామి అమ్మవార్లను మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం మీదుగా బయలువీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, ముంబాయ్ డోలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవ నృత్యం, బుట్టబొమ్మలు, భీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామి అమ్మవార్లకు ఆస్థాన సేవ జరిగింది. రావణ వాహనాధీశుడైన స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారు కష్టాలనుండి వీడి సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈఓ డీ పెద్దిరాజు, ధర్మకర్తలమండలి సభ్యులు విరూపాక్షయ్య, విజయలక్ష్మి, ఈఈలు రామకృష్ణ, నర్సింహ్మరెడ్డి, మురళీధర రెడ్డి, ఏఈవోలు మోహన్, హరిదాస్, మల్లికార్జున రెడ్డి, స్వాములు ఫణిధర ప్రసాద్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న, అర్చక, వేద పండితులు పాల్గొన్నారు.
ఆలయ మాడవీధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయని పీఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు.