అమరావతి : ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ( Sharmila) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తొమ్మిది ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ అభ్యర్థులకు (DSC Candidates) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం విడుదల చేసింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని ఆరోపించారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే జగన్ ప్రభుత్వం 6 వేల పోస్టులతో వేసిందని విమర్శించారు.
ఐదేళ్లు నోటిఫికేషన్(Notification) ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారని, ఎన్నికలకు నెలన్నర ముందు పోస్టుల భర్తీ చేయడం వెనుక మర్మమేమిటో తెలుపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, టెట్ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి సన్నద్దం కావాలని, నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష సాధింపు చర్య కాదా? అని ప్రశ్నించారు.