గుంటూరు: మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో మొత్తం 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి కరోనాతో మరణించడంతో అనాథగా మారిన బాలికను మాయమాటలు చెప్పి ఓ మహిళ తన వెంట తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించింది. గుంటూరు జిల్లాలో ఈ సంఘటన సంచలనం రేపింది.
గుంటూరు నగరానికి చెందిన తల్లీకూతుళ్ళకు గత ఏడాది జూన్ నెలలో కరోనా సోకింది. వారిద్దరినీ జీజీహెచ్లో చేర్పించారు. చికిత్స పొందుతూ తల్లి చనిపోయింది. ఇక్కడ పరిచయమైన స్వర్ణకుమారి అనే మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లింది. అనంతరం ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. గుంటూరు, విజయవాడ, కాకినాడ, తణుకు, నెల్లూరు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉంచి వ్యభిచారం చేయించింది. 6 నెలల పాటు బాలికను చిత్రహింసలకు గురిచేసింది. ఆరోగ్యం క్షీణించడంతో స్వర్ణకుమారి చెర నుంచి తప్పించుకుని తండ్రి వద్దకు చేఇర జరిగిందంతా చెప్పింది. దాంతో బాలికతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయించారు.
కేసును సీరియస్గా తీసుకున్న అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ వ్యభిచార ముఠాను పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వర్ణకుమారితోపాటు 23 మందిని అరెస్టు చేశారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో ఇంత పెద్ద సంఖ్యలో నిందితులు అరెస్ట్ కావడం సంచలనం రేపుతున్నది.