తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 5వేల మంది పోలీసులతో భద్రతా కల్పిస్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భక్తు లు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశముందని భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడిం చారు. మాడ వీధుల్లోకీ భక్తులు సులభతరంగా వచ్చే విధంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
హారతి సమయంలో అదనంగా భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఘాట్ రోడ్డుల లో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. గరుడసేవ నాడు భక్తులు ఓపికగా నిరీక్షించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు.
12 వేల వాహనాలు దాటిన తరువాత తిరుమలకు కార్లను అనుమతించబోమని ఆయన వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ కేంద్రాల్లో వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30న మధ్యాహ్నం నుంచి ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించడం లేదన్నారు.