అమరావతి : కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని అమలాపురంలో నిర్వహించిన ఆందోళన విధ్వంసక పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు విధించిన ఆంక్షలను పొడిగించారు. ఇంటర్నెట్ సేవలను మరో 24 గంటల పాటు పొడిగించగా 144 సెక్షన్ను ఐదు రోజుల పాటు పొడిగించారు. ఈనెల అమలాపురంలో యువకులు భారీ ర్యాలీని నిర్వహించారు. పోలీసులు సైతం ఊహించని విధంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసు జీపును దగ్ధం చేశారు. స్కూళ్ల బస్సులపై తమ ప్రతాపాన్ని చూపారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ, డీఎస్సీ గన్మెన్లకు గాయాలయ్యాయి. మంత్రి విశ్వరూప్ ఇంటిని చుట్టు ముట్టి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ఇంటిని దహనం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటికి సైతం నిప్పంటించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పోలీస్ అధికారులపై సీరియస్ అయ్యారు. దీంతో విధ్వంసానికి పాల్పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇపపటి వరకు 46 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా 19 మందిని అరెస్టు చేశారు. ఇవాళ మరో 25 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.