అమరావతి: రాష్ట్రంలోని గ్రామసచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. దాంతో ప్రబేషన్ వస్తుందా? రాదా? అని.. వస్తే అందరికీ వస్తుందా..? లేక కొందరినే వరిస్తుందా? అనే అనుమానాలతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రొబేషన్ ఖరారై పెరిగిన జీతం వస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. అయితే, జూన్ నెల సగం పూర్తికావస్తున్నా.. ప్రొబేషన్ దస్త్రం కదలడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది గ్రామసచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రొబేషన్ ఇవ్వనున్నట్లు గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే హామీ ఇచ్చి రోజులు, నెలలు గడిచిపోతున్నా.. ఇంతవరకు దస్త్రంపై సంతకం పడకపోవడం, ఉత్తర్వులు వెలువడకపోవడంతో సచివాలయ ఉద్యోగుల్లో ప్రొబేషన్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు ఇస్తుందని ఒకసారి చెప్తుండగా.. కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేస్తారని మరికొందరు చెప్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా అందర్నీ ప్రమోట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగిగా ఖరారు చేసి.. పే స్కేల్ ఇవ్వాలి. ఇలాంటి అవకావం వస్తుందనే ఆశతో వీరు గత మూడేండ్లుగా కేవలం రూ.15 వేల జీతంతో నెట్టుకొస్తున్నారు.
వచ్చే నెల నుంచి ప్రొబేషన్ అంది పెరిగిన జీతాలు ఖాతాల్లో జమ అవుతాయన్న గంపెడాశలో గ్రామసచివాలయ ఉద్యోగులు ఉన్నారు. అయితే, వచ్చే నెల నుంచి కొత్త జీతాలు రావాలంటే ఆ మేరకు జీతం బిల్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందని, దీనికి చాలా సమయం తీసుకుంటున్నందున వచ్చే నెలలో సాధ్యం కాదని కొందరు భావిస్తున్నారు. చివరికి సమయం సరిపోలేదన్న సాకుతో వాయిదా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని వీరు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల్ని టెన్షన్ పెట్టకుండా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని గ్రామసచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.