కర్నూలు : ప్రైవేటు బస్సులో తరలిస్తున్న బంగారం పట్టుబడటం కలకలం రేపుతున్నది. బస్సులో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తుండగా.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి దాదాపు 14 కిలోల బంగారం బిస్కెట్లు దొరికాయి. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు.. విచారణ నిమిత్తం సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ దాదాపు రూ.28 లక్షల వరకు ఉంటుందని సెబ్ అధికారులు తెలిపారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపిన వివారల ప్రకారం.. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద ఆపి సెబ్ అధికారులు తనిఖీ చేశారు. కర్ణాటక బళ్లారికి చెందిన రాజేశ్ అనే ప్రయాణికుడి సంచిలో కళ్లు చెదిరే రీతిలో 14.8 కిలోల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో గుమాస్తాగా పనిచేస్తున్నట్టు రాజేష్ తెలిపినట్లు సెబ్ సీఐ మంజుల వెల్లడించారు. సంస్థ యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓ నగల దుకాణం నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పాడు. ఈ బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కర్నూలు అర్బన్ పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.