అమరావతి : రైతాంగ సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన సందర్భంగా తాడేపల్లిలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా వైసీపీ ముఖ్య నాయకుల ( YCP Leaders )పై తాడేపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు (SC, ST Case ) నమోదు నమోదు చేశారు. శనివారం వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్తో పాటు మరికొందరు అమరావతికి బయలు దేరారు. వారి రాకను గమనించిన రైతులు, టీడీపీ నాయకులు తాడేపల్లి మండలం ఉండవల్లిలో అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్న గాని పరస్పరం రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఘటనలో కానిస్టేబుల్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనపై పెనుమాకకు చెందిన తెనాలి మాణిక్యం ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్తోపాటు పానుగంటి చైతన్య, డైమండ్ బాబు,మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, నారాయణమూర్తి లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
అదేవిధంగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, చైతన్యపై పోలీస్ యాక్ట్ 30 ప్రకారం కేసు నమోదు చేశారు.